మే 15, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో జరగనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలువురు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఎన్నికల అధికారుల కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు కోరారు. ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.కొన్ని వర్గాల ఓట్ల తొలగింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఎన్నికల కమిషన్ అప్రమత్తంగా వ్యవహరించాలని కాంగ్రెస్ ప్రతినిధులు సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, ఎవరూ తమ ఓటు హక్కు కోల్పోకూడదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలంతా తమ ఓటు జాబితాలో ఉందో లేదో స్వయంగా పరిశీలించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు పరిరక్షణలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు ఎన్నికల అధికారికి వినతిపత్రం సమర్పించారు.
