మే 15, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో చేపట్టనున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డితో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.దేశంలోని పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణలో అవకతవకలు జరిగాయని మహేశ్ గౌడ్ ఆరోపించారు. కొన్ని ప్రాంతాల్లో ఓట్ల తొలగింపులు, కొత్త ఓట్ల చేర్పుల విషయంలో అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితులు రాకుండా ఎన్నికల సంఘం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.పేదలు, వలస కార్మికులు, ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారి ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఓటర్ల ధృవీకరణ ప్రక్రియకు తగిన సమయం ఇవ్వాలని, బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి సమగ్రంగా పరిశీలించాలని సూచించారు.బీజేపీకి అనుకూలం కాని ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ మహేశ్ గౌడ్ విమర్శలు గుప్పించారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వయంగా పరిశీలించుకోవాలని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.జూన్ 25 నుంచి రాష్ట్రంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని, జూలై 24 వరకు వివరాల సేకరణ కొనసాగుతుందని ఆయన తెలిపారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా విడుదలయ్యే అవకాశం ఉందన్నారు.
