మే 19, (నేటి తెలుగు పత్రిక): బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కల నియంత్రణపై గతంలో జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్ను భారత సుప్రీం కోర్టు తిరస్కరించింది. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని వీధి కుక్కల సమస్యను కేవలం జంతు సంక్షేమ అంశంగా కాకుండా ప్రజా భద్రతా సమస్యగా పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది.స్కూళ్లు, కాలేజీలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలంటూ జంతు ప్రేమికులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. అలాగే భారత జంతు సంక్షేమ మండలి దాఖలు చేసిన పిటిషన్లను కూడా కొట్టివేసింది.దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక పూర్తి స్థాయి యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. అవసరాన్ని బట్టి మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. అలాగే వీధి కుక్కల నియంత్రణకు సంబంధించిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.ప్రజల భద్రత దృష్ట్యా రేబిస్ వ్యాధి నివారణకు అవసరమైన యాంటీ రేబిస్ టీకాలు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ప్రమాదకరంగా మారిన లేదా రేబిస్ బారిన పడిన కుక్కల విషయంలో చట్టబద్ధంగా అనుమతించిన చర్యలు తీసుకోవచ్చని కూడా స్పష్టం చేసింది.అదేవిధంగా జాతీయ రహదారులపై సంచరించే జంతువుల సమస్యపై కూడా కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రహదారులపై తిరిగే పశువుల వల్ల ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు సూచించింది.కోర్టు ఆదేశాల అమలు కోసం పనిచేసే సిబ్బందికి రక్షణ కల్పించాలని, విధులు నిర్వహించే అధికారులపై ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
