మే 19, (నేటి తెలుగు పత్రిక): మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద రూ.262 కోట్ల నిధులను ఆయన విడుదల చేశారు. చరిత్రలో తొలిసారి ఈ స్థాయిలో నిధులు నేరుగా మత్స్యకారుల ఖాతాల్లో జమ చేసినట్లు సీఎం పేర్కొన్నారు. రూ.3,256 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నామని ఆయన తెలిపారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించిన సీఎం, పనులు త్వరలో పూర్తవుతాయని స్పష్టం చేశారు.‘మన జలాల్లోకి వేటకు వస్తే చర్యలు తప్పవు’ అని హెచ్చరించిన చంద్రబాబు, రాష్ట్ర తీర జలాలపై పూర్తి హక్కులు తమవేనని తెలిపారు. ఇతర రాష్ట్రాల బోట్లను శాటిలైట్ ద్వారా గుర్తించే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.మత్స్య ఉత్పత్తులు పెంచడం, ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయం పెరుగుతుందని సీఎం అన్నారు. చేపలు ప్రోటీన్ సమృద్ధిగా ఉండటంతో ఆరోగ్యానికి మంచిదని పేర్కొన్నారు. ‘మత్స్యకారుల ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్గా కూడా పనిచేస్తా’ అని వ్యాఖ్యానించారు.
