మే 19, (నేటి తెలుగు పత్రిక): పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ చేపట్టిన ఆందోళనలు పూర్తిగా విఫలమయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ధర్నాల్లో వైసీపీ కార్యకర్తలే కనిపించలేదని, ఆందోళనలను చూసి వారి పార్టీ నేతలే నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.పెట్రోల్, డీజిల్ ధరలు గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే పెరిగాయని గుర్తుచేసిన సోమిరెడ్డి.. ఇప్పుడు అదే విషయంపై వైసీపీ నిరసనలు చేపట్టడం విచిత్రంగా ఉందన్నారు. “మీ ప్రభుత్వంలో పెంచిన ధరలపై మీరే ఆందోళన చేస్తారా?” అంటూ వైసీపీ నేతలను ప్రశ్నించారు.టీడీపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నా.. ఈ కాలంలో పెట్రోల్, డీజిల్పై ఒక్క పైసా కూడా పెంచలేదని ఆయన స్పష్టం చేశారు. అసలు వాస్తవాలు తెలుసుకోకుండా వైసీపీ నేతలు రోడ్డెక్కడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని సోమిరెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా మద్యం ధరలు పెంచడమే కాకుండా నకిలీ మద్యం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. ఆ ఘటనలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని పేర్కొన్నారు.రాజకీయాల్లో ప్రజా సమస్యలపై నిజాయితీగా పోరాడాల్సిన అవసరం ఉందని, కానీ వైసీపీ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం ఆందోళనలు చేస్తోందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.
