మే 19, (నేటి తెలుగు పత్రిక): పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై కీలక సూచనలు చేశారు.భూసేకరణ నిధుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకుంటామని, పెండింగ్ బిల్లులను త్వరగా క్లియర్ చేస్తామని సీఎం తెలిపారు. ప్రాజెక్టుల పనుల పురోగతిని జిల్లా మంత్రులు, అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు.

