మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశంలోని దేవాలయాలు, మతపరమైన సంస్థల వద్ద ఉన్న బంగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గోల్డ్ బాండ్లు జారీ చేయబోతుందన్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది.ఇటీవల సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోలు, కొన్ని ఆన్లైన్ కథనాల్లో దేవాలయాల బంగారు నిల్వలను “మానిటైజ్” చేయాలని కేంద్రం నిర్ణయించిందంటూ విస్తృత ప్రచారం జరిగింది. ఈ వార్తలతో భక్తుల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. దేవాలయ ట్రస్టులు లేదా మతపరమైన సంస్థల బంగారాన్ని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకునే ఆలోచన లేదని వెల్లడించింది. గోల్డ్ బాండ్లు జారీ చేస్తారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పింది.ఆలయ గోపురాలు, తలుపులు, ఇతర నిర్మాణాలపై ఉన్న బంగారు పూతలను కూడా “వ్యూహాత్మక బంగారు నిల్వలు”గా పరిగణిస్తారన్న ప్రచారాన్ని కూడా కేంద్రం పూర్తిగా కొట్టిపారేసింది. ప్రజల్లో అపోహలు సృష్టించేలా తప్పుడు ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని పేర్కొంది.ప్రభుత్వ విధానాలకు సంబంధించిన సమాచారం అధికారిక వేదికల ద్వారా మాత్రమే నమ్మాలని కేంద్రం సూచించింది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మి ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.మతపరమైన అంశాలపై తప్పుడు ప్రచారం సమాజంలో ఉద్రిక్తతలకు దారితీయొచ్చని హెచ్చరించిన కేంద్రం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం అధికారిక వివరణ రావడంతో దేవాలయాల బంగారం అంశంపై నెలకొన్న గందరగోళానికి కొంతవరకు తెరపడింది.
