మే 19, (నేటి తెలుగు పత్రిక): టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డి రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో భూమా మౌనిక పోటీ చేస్తారని వెల్లడిస్తూ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించారు. తాము ఇప్పుడు రాజకీయాల్లో భాగమయ్యామని కూడా ఆయన స్పష్టం చేశారు.తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్.. ఇటీవల ప్రారంభించిన ‘ఐఖ్య’ సంస్థపై స్పందించారు. ‘ఐఖ్య’ రాజకీయ పార్టీ కాదని, ప్రజల సమస్యలపై స్పందించే సామాజిక వేదిక మాత్రమేనని తెలిపారు. యువతలో ధైర్యం నింపడం, అన్యాయానికి గురైన వారికి అండగా నిలవడమే సంస్థ లక్ష్యమని చెప్పారు.‘ఐఖ్య’ కార్యకలాపాలకు ఎలాంటి రాజకీయ పార్టీ నుంచి నిధులు తీసుకోవడం లేదని, తన సొంత డబ్బులతోనే సంస్థను నడిపిస్తున్నానని మనోజ్ వెల్లడించారు. ప్రజల కోసం నిజాయితీగా పనిచేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నానని పేర్కొన్నారు.భూమా మౌనిక రాజకీయాల్లోకి రావడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి రాజకీయ వారసత్వం ఉన్న నేపథ్యంలో ఆమె ఎంట్రీపై చర్చ జరుగుతోంది. అయితే ఆమె ఏ పార్టీ నుంచి, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న విషయంపై మాత్రం మనోజ్ స్పష్టత ఇవ్వలేదు.ఈ సందర్భంగా మోహన్ బాబుతో ఉన్న విభేదాలపై ప్రశ్నించగా మనోజ్ సరదాగా స్పందించారు. “ఆ ప్రశ్న ఎవరిని అడగాలో మీకు తెలుసు.. కానీ మైక్తో వెళ్లకండి.. వెళ్లినా హెల్మెట్ పెట్టుకోండి” అంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు అక్కడ నవ్వులు పూయించాయి.ఇటీవల మంచు కుటుంబ విభేదాలు వార్తల్లో నిలుస్తున్న వేళ మనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఇక భూమా మౌనిక రాజకీయ ప్రవేశం, మనోజ్ సామాజిక కార్యకలాపాలు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
