మే 19, (నేటి తెలుగు పత్రిక): పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి చేసిన ఫిర్యాదుపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందించారు. రామసహాయం కృష్ణ కిషోర్ రెడ్డి, హరిప్రసాద్లపై ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి ఈ ఇద్దరు నేతలే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు.హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన మల్లు రవి.. కృష్ణ కిషోర్ రెడ్డి, హరిప్రసాద్ తమ వాదనలు కమిటీ ముందు వినిపించారని చెప్పారు. ఎమ్మెల్యేతో కలిసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పని చేస్తామని ఇద్దరు నేతలు హామీ ఇచ్చినట్లు తెలిపారు. అందరూ సమన్వయంతో పనిచేస్తే పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు.మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ఇరు వర్గాల మధ్య సమన్వయం చేస్తారని చెప్పారు. ప్రస్తుతం ఎవరినీ సస్పెండ్ చేసే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు.ఇదే సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలోని కాంగ్రెస్ నేతలకు మల్లు రవి హెచ్చరికలు జారీ చేశారు. కొందరు నేతలు తామే కార్పొరేటర్ అభ్యర్థులమంటూ ముందుగానే ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. పార్టీ నిర్ణయం లేకుండా ఇలాంటి ప్రకటనలు చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక విధానం ఉందని గుర్తుచేశారు.నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలపైనా మల్లు రవి ఘాటుగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగల నాయకుడని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ బలోపేతానికి రేవంత్ కీలకంగా పనిచేస్తున్నారని అన్నారు.
