మే 19, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో దళితులు, బీసీలు, మైనార్టీలపై అనేక దాడులు జరిగాయని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.మచిలీపట్నంలోని బలరామునిపేట ఎస్సీ కాలనీలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ దళిత యువకుడు సుబ్రహ్మణ్యం నాలుగో వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళిత నాయకులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. సుబ్రహ్మణ్యం హత్య కేసును జగన్ ప్రభుత్వం తారుమారు చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు.మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను మానసిక రోగిగా చిత్రీకరించి చంపేశారని కొల్లు రవీంద్ర విమర్శించారు. అలాగే ఇసుక అక్రమాలపై ప్రశ్నించిన ఓం ప్రకాష్ను కూడా హత్య చేశారని ఆరోపించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛ లభించిందని మంత్రి అన్నారు. జగన్ పాలనలో హత్యకు గురైన బీసీ యువకుడు తోట చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించామని చెప్పారు.అధికారులకు కులాలు అంటగట్టి దూషించడం సరికాదని జగన్పై మంత్రి మండిపడ్డారు. ఓ పాస్టర్ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటనను కూడా రాజకీయంగా మలచాలని ప్రయత్నించారని విమర్శించారు. ప్రజలు ఇలాంటి రాజకీయాలను గమనించాలని, అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.
