మే 19, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను జగన్ దెబ్బతీశారని ఆమె ఆరోపించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన షర్మిల.. “వైఎస్ పేరు చెప్పుకుని ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు కానీ, ప్రజలకు చేసినది స్విచ్లు నొక్కడం మాత్రమే” అంటూ విమర్శించారు.ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకోవడమే నిజమైన నాయకత్వమని, కేవలం పథకాల పేరుతో డబ్బులు పంపిణీ చేస్తే సరిపోదని షర్మిల వ్యాఖ్యానించారు. వైఎస్సార్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రజల వద్దకు వెళ్లాలని భావించారని గుర్తుచేశారు.అలాగే జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన షర్మిల.. “తండ్రి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, చివరికి అదే ఆశయాలను నాశనం చేశారు” అని మండిపడ్డారు. బీజేపీతో వైసీపీ అక్రమ పొత్తు పెట్టుకుందని ఆరోపిస్తూ, కేంద్రం చెప్పినట్టే జగన్ వ్యవహరించారని విమర్శించారు.ఇటీవల వైసీపీ చేపట్టిన ధర్నాలపై కూడా షర్మిల సెటైర్లు వేశారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రజలపై భారాలు మోపిన విషయాలను ఇప్పుడు మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు.
