మే 20, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖ పనితీరును మరింత పారదర్శకంగా మార్చాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణాలు, అభివృద్ధి పనులు, వాటి పురోగతిని ప్రజలు నేరుగా తెలుసుకునేలా ప్రత్యేక పబ్లిక్ డ్యాష్బోర్డ్ రూపొందించాలని సూచించారు. పంచాయతీరాజ్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన కీలక మార్గదర్శకాలు ఇచ్చారు. “ప్రజలకు జవాబుదారీతనం కనిపించాలి.. ప్రతి పని పారదర్శకంగా ఉండాలి” అని స్పష్టం చేశారు.స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆన్లైన్ పన్నుల వసూళ్లు విజయవంతంగా జరిగాయని పేర్కొంటూ.. పంచాయతీలు తమ ఆదాయ వనరులను మరింత పెంచుకోవాలని సూచించారు.అలాగే శాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా అమలు చేస్తున్న “స్వచ్ఛరథాలు” మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. ప్రజలు పొడి వ్యర్థాలు ఇచ్చి, బదులుగా నిత్యావసర వస్తువులు తీసుకెళ్లే విధానానికి మంచి స్పందన వస్తోందన్నారు. ఈ పథకాన్ని అన్ని నియోజకవర్గాలకు విస్తరించాలని ఆదేశించారు.తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన “గ్రీన్ షాప్” విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు. ఏప్రిల్ నెలలో మాత్రమే స్వచ్ఛరథాల ద్వారా 18.86 లక్షల కిలోల చెత్త సేకరించామని, దాని విలువ దాదాపు రూ.3 కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు.రోడ్ల నిర్మాణ పనుల విషయంలోనూ పవన్ కళ్యాణ్ స్పష్టమైన గడువులు ఉండాలని పేర్కొన్నారు. ప్రతి పని ఎప్పటిలోగా పూర్తి చేస్తామో ముందుగానే నిర్ణయించుకుని, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిపై బాధ్యతగా స్పందించాలని సూచించారు.ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ Kanthilal Dande, కమిషనర్ Krishna Teja, ఈఎన్సీ Balu Nayak పాల్గొన్నారు.
