జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పెన్షన్లను రూ.4 వేలుకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా పెన్షన్ పెంపును అమలు చేసి వృద్ధులకు ప్రభుత్వం అండగా నిలిచిందని పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా పోరంకి సుగాలి కాలనీలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్తో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షల మందికి పైగా పెన్షన్లు అందుతున్నాయని తెలిపారు.
వృద్ధాప్య పెన్షన్ను రూ.4 వేలుకు పెంచడంతో పాటు, వికలాంగులకు రూ.6 వేల నుంచి రూ.15 వేల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు అనురాధ వివరించారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, సంక్షేమం-అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆమె పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్ను అభినందించారు.
