జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నైరుతి రుతుపవనాలు, వర్షపాతం అంచనాలు, ఎల్నినో ప్రభావంపై వాతావరణ శాఖ అధికారులు నివేదిక సమర్పించారు.
వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. తక్కువ నీటితో సాగు చేయగల పంటలు, పంటల మార్పిడి, పంటల వైవిధ్యంపై రైతులకు విస్తృతంగా సూచనలు అందించాలని చెప్పారు.
అలాగే రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్వహణ పనులపై సమీక్ష నిర్వహించిన సీఎం, గేట్ల మరమ్మతులు మరియు ఇతర నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని సూచించారు.
విపత్తు నిర్వహణ కోసం అందుబాటులో ఉన్న రూ.1,000 కోట్ల నిధులను నిబంధనల ప్రకారం వినియోగించాలని అధికారులకు సూచించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు, కూలిపోయిన వంతెనల పునర్నిర్మాణానికి అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు.
ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణనష్టం, ఆస్తినష్టం, పశునష్టం సంభవించినప్పుడు అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. సమావేశంలో వ్యవసాయం, నీటిపారుదల, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఆరోగ్యం, హోంశాఖ, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
