స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి: కవిత
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద జరిగిన బీసీ మహాసభలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ, బీసీల రిజర్వేషన్లు అమలు చేయకపోతే తాము గట్టిగా వ్యతిరేకిస్తామని హెచ్చరించారు.
42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని కవిత గుర్తుచేశారు. బీసీల హక్కులపై కులగణన చేపట్టాలని బీజేపీ ప్రభుత్వం ను డిమాండ్ చేస్తూ, “కులగణనలో గందరగోళం సృష్టించకుండా వాస్తవ లెక్కలు తీయాలి. బీసీలకు తగినంత న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేయాలి” అని అన్నారు.
కులగణనపై స్పష్టత అవసరం
జనగణనలో భాగంగా కులగణన చేయడం తక్షణ అవసరమని, బీసీల లెక్కలు ఒక కమిషన్ తీస్తుంటే మరొక కమిషన్ నివేదిక ఇస్తున్న పరిస్థితి ఏమిటని కవిత ప్రశ్నించారు. “ఇలా చేస్తే కోర్టుల్లో ఈ నివేదికలు నిలబడతాయా? బీసీలను తక్కువ చేసి చూపే కుట్రలను సహించేది లేదని” ఆమె స్పష్టం చేశారు.
బీసీల కోసం నిరంతర పోరాటం
“మన ఉద్యమాల వల్లే సావిత్రీబాయి ఫూలే జయంతి అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంబేద్కర్ లాంటి నేతలు బీసీలకు రాజ్యాంగ రక్షణ కల్పించి ఉంటే, ఈ దేశం అభివృద్ధిలో ముందుండేదని” కవిత అన్నారు.
నిర్ణయానికి పిలుపు
“బీసీల జనాభా ఎంత ఉంటే ఆ మేరకు వాటాను కల్పించి ఎన్నికలు నిర్వహించాలి. దొంగ లెక్కలు, కాకిలెక్కలు కాకుండా వాస్తవ లెక్కల ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం తప్పనిసరి” అని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీసీ హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని ఆమె చెప్పారు.
