తెలంగాణ హైడ్రా బుల్డోజర్ కూల్చివేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చేరిన అంశం
తెలంగాణలో హైడ్రా బుల్డోజర్ కూల్చివేతల అంశం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కృత నేత బక్క జడ్సన్ ఈ విషయంపై రాష్ట్రపతికి లేఖ రాశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. “తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్లు, భూములు ఇచ్చిన చరిత్ర ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పేదల ఇళ్లు కూలగొడుతోంది. గురుకుల పాఠశాలలో 40 మంది విద్యార్థులు మృతి చెందారు. హైడ్రా శాఖను మాఫియా మాదిరిగా మార్చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు చెరువు భూమిలో ఉన్నప్పటికీ, పేదల ఇళ్లు కూలగొడుతున్నారు,” అని ఆరోపించారు.
బక్క జడ్సన్ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర ఆరోపణలు చేశారు. “ముఖ్యమంత్రిపై 88 కేసులు ఉన్నాయి. లగచర్లలో ఎస్టీ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీని సినిమా ప్రమోషన్లకు వేదికగా మారుస్తున్నారు. గురుకుల సమస్యలతో పాటు హైడ్రా ఇతర సమస్యలపై ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా ఉన్నారు. అంబేద్కర్ హక్కులను తెలంగాణ కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు,” అని వ్యాఖ్యానించారు.
ఈ అంశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బక్క జడ్సన్ కోరారు.
