బండి సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు
హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) పై తెలంగాణ కాంగ్రెస్ నేత మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, బండి సంజయ్ తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉక్కు మహిళ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) పై చేసిన వ్యాఖ్యలు దిగజారుడు సంస్కృతికి నిదర్శనమని మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలన అభివృద్ధికి నిదర్శనం:
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు. దావోస్లో రికార్డు స్థాయిలో లక్షా 78 వేల 950 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, ఇది కాంగ్రెస్ చేతుల మీదుగా సాధ్యమైందని అన్నారు. కేసీఆర్ పాలనలో పదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. అంతేకాకుండా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు.
ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు భరోసా:
రాబోయే ఎన్నికల నాటికి తెలంగాణ ప్రజల ఆశలు అందుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మహేశ్ కుమార్ తెలిపారు. పేదల కోసం ఏర్పాటు చేసిన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రాజెక్టులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా వంటి పథకాలు త్వరలోనే ప్రారంభమవుతాయని ప్రకటించారు.
బీఆర్ఎస్పై తీవ్ర వ్యాఖ్యలు:
బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన మహేశ్ కుమార్ గౌడ్, “బీఆర్ఎస్ నేతలు అభివృద్ధిపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది,” అంటూ ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీలో తండ్రి, కొడుకు తప్ప ఎవరూ మిగలరని, పార్టీ నాలుగు ముక్కలు కావడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ సిద్ధాంతాలు నమ్మే ప్రభుత్వమే భరోసా:
పేదల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపర్చేందుకు నిరంతరం కృషి చేస్తోందని, బీఆర్ఎస్ విమర్శలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారన్నారు.
