హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ నిర్లక్ష్యం – కార్పొరేటర్ల అరెస్టుపై కేటీఆర్ మండిపాటు
హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చూపుతోందని, నిధులు ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ (BRS) కార్పొరేటర్లను అరెస్టు చేయడం దుర్మార్గం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ (GHMC) కౌన్సిల్ సమావేశం సందర్భంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన తెలిపినందుకు మేయర్ విజయలక్ష్మి (Mayor Vijayalakshmi) వారిని సస్పెండ్ చేయగా, అనంతరం పోలీసులు అరెస్ట్ చేశారు.
జీహెచ్ఎంసీ బడ్జెట్పై వివాదం
2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 8,440 కోట్ల జీహెచ్ఎంసీ బడ్జెట్ కౌన్సిల్ ఆమోదం పొందింది. అయితే, హైదరాబాద్ అభివృద్ధికి నిధులు కేటాయించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది అని ఆరోపిస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియం వద్ద నిరసన చేపట్టారు. క్వశ్చన్ హవర్ను అడ్డుకోవడం, వాగ్వాదం జరగడం, సభ వాయిదా పడడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. సెక్షన్ 89/1 ప్రకారం బీఆర్ఎస్ కార్పొరేటర్లను మేయర్ సస్పెండ్ చేయగా, మార్షల్స్ వారిని బయటకు తరిమేశారు. ఈ చర్యలతో ఆగ్రహించిన కార్పొరేటర్లు మేయర్ క్షమాపణ చెప్పే వరకు కదిలేది లేదంటూ కార్యాలయం ముందు బైఠాయించారు.
కేటీఆర్ తీవ్ర విమర్శలు
కార్పొరేటర్ల అరెస్టుపై తీవ్రంగా స్పందించిన కేటీఆర్, “కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు అని ప్రశ్నిస్తే బయటకు గెంటేస్తారా?” అంటూ నిలదీశారు. “గత సంవత్సరం ఖర్చు చేయని బడ్జెట్ను మళ్లీ కొత్తగా చూపించి ప్రజలను మోసం చేస్తున్నారు” అని ఆరోపించారు.
“హైదరాబాద్ పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస సౌకర్యాలను కూడా మెరుగుపరచలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అభివృద్ధికి అడ్డు పడుతోంది” అని మండిపడ్డారు. “గత ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలి. లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. అరెస్టులు, బెదిరింపులతో బీఆర్ఎస్ నాయకులను అణగదొక్కాలని చూస్తే, ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం తప్పదు” అని కేటీఆర్ హెచ్చరించారు.
హైదరాబాద్ అభివృద్ధి, జీహెచ్ఎంసీ బడ్జెట్ అంశాలపై రాజకీయ వివాదం తారస్థాయికి చేరింది. బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
