“కుంభకర్ణుడిలా నిద్రలేచిన కేసీఆర్” – విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే. చంద్రశేఖర్ రావు (KCR) సుదీర్ఘ నిశ్శబ్దం తర్వాత పెడబొబ్బలు పెడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. “నేను కొడితే మామూలుగా ఉండదు” అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, “అసెంబ్లీ ఎన్నికల్లో మా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొట్టిన దెబ్బకు కేసీఆర్ ఫామ్ హౌస్లో పడిపోయారు” అంటూ ఎద్దేవా చేశారు.
“ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తీసుకురాగా, రేవంత్ సీఎం అయ్యారు. ఈ లాజిక్ను మీరు ఎందుకు మరిచిపోతున్నారు?” అని ఆయన ప్రశ్నించారు. 13 నెలలుగా అసెంబ్లీకి రాకుండా, ప్రజలను కలవకుండా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేసిన కేసీఆర్ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయనే బయటకు వస్తానంటున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్కు ఎన్నికల తప్ప ప్రజల సంక్షేమం ముఖ్యం కాదని ఆయన వైఖరి స్పష్టంగా చెబుతోందని తెలిపారు.
కేసీఆర్ “నేను గంభీరంగా ఉన్నా, మౌనంగా చూస్తున్నా” అంటూ చేసిన వ్యాఖ్యల వెనుక గాంభీర్యం ఏమీలేదని, బేలతనం మాత్రమే కనిపిస్తుందని ఆది శ్రీనివాస్ విమర్శించారు. పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చేసిన ఉద్యమాలను ప్రజలు మెచ్చి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారని చెప్పారు.
“ఇందిరమ్మ రాజ్యం తిరిగి రావడాన్ని జీర్ణించుకోలేక, తట్టుకోలేక కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు. ఇప్పుడు మేకపోతు గాంభీర్యంతో మాట్లాడుతున్నారు” అని ఆయన ధ్వజమెత్తారు.
కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అద్దంకి దయాకర్ సహా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు ఖండిస్తూ “నిజంగా ప్రజల్లోకి రావాలంటే కేసీఆర్ ఫామ్ హౌస్ను వదిలిపెట్టాలి, అప్పుడే ప్రజలకు అసలు నిజం తెలుస్తుంది” అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
