తెలంగాణ బీసీ జనాభా తగ్గిందా? – కులగణన సర్వేపై వివాదం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన బీసీ కుల గణన (Caste Census) నివేదికపై పెద్ద చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా జనాభా సగటున 13% పెరుగుతుండగా, తెలంగాణలో మాత్రం బీసీ జనాభా తగ్గిందని బయటకు వచ్చిన సమాచారం బీసీ వర్గాల్లో ఆందోళన రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదేళ్లకు 13-15% జనాభా పెరుగుతుంటే, తెలంగాణలో బీసీ జనాభా తగ్గడం ఆశ్చర్యకరమని బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
బీసీ జనాభా తగ్గి, ఓసీ జనాభా పెరగడం ఎందుకు?
బీసీ జనాభా తగ్గిపోవడంపై వివిధ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఓసీ జనాభా మాత్రం పెరిగిందని నివేదికలో వెల్లడైంది. దీనిపై కొంతమంది అధికారులు లాజికల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
మున్నూరు కాపుల గణనలో పొరపాటు?
తెలంగాణలో మున్నూరు కాపులను గతంలో ఓసీ కేటగిరీలో ఉంచేవారు. కానీ 1950 తర్వాత తెలంగాణలో మున్నూరు కాపులని బీసీల్లో చేర్చారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కాపులు ఓసీ కేటగిరీకి చెందినవారే. అయితే, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మున్నూరు కాపులు రెడ్లతో సామాజిక సంబంధాలు కలిగి ఉండటంతో, కొన్ని గ్రామాల్లో సంబంధాలు కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. వారిలో చాలా మంది “రెడ్డి” అనే పేరును చివరలో ఉపయోగించడం ప్రారంభించారు. రెడ్డి అని పేరు చివర్లో తగిలించుకున్న వారంతా మున్నూరు కాపులే అయి ఉండడంతో వారి జనాభా తగ్గిపోయింది. పేరు చివర రెడ్డి ఉన్న వాళ్లంతా బీసీ సర్టిఫికెట్ పొంది ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గం.
తాజాగా కుల గణన సర్వేలో “రెడ్డి” అనే పదం ఉన్న వారిని ఓసీ జాబితాలో చేర్చినట్లు అనధికార సమాచారం వెల్లడవుతోంది. దీంతో మున్నూరు కాపుల జనాభా తక్కువగా, ఓసీ జనాభా అధికంగా నమోదైందని చెబుతున్నారు.
సర్వేలో సాంకేతిక లోపమా?
సర్వే సమయంలో సర్వేయర్లకు పూర్తి సమాచారం లేకపోవడం, మున్నూరు కాపులను ఓసీ జాబితాలో చేర్చడానికి కారణమైందని అంటున్నారు. ఈ గణనలో తలెత్తిన సమస్యలను ప్రభుత్వం అఫీషియల్గా స్పష్టత ఇవ్వాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఓటర్ల లిస్టు, కుల గణన తేడా?
మరోవైపు, ఓటర్ లిస్టును కుల గణన సర్వేతో పోల్చి చూడటంలో గణనలో హెచ్చుతగ్గులు వస్తున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో చాలామందికి రెండు చోట్ల ఓటు ఉండటం వల్ల కూడా జనాభా లెక్కల్లో తేడా ఏర్పడిందని సమాచారం.
ప్రభుత్వం స్పందిస్తే వివాదానికి తెరపడుతుందా?
బీసీ జనాభా తగ్గిందా, గణనలో తప్పిదాలు జరిగాయా? అనే విషయంపై ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక స్పష్టత ఇవ్వలేదు. సర్వే గణాంకాలపై ప్రభుత్వం ఓ క్లారిటీ ఇచ్చే వరకు ఈ వివాదం కొనసాగే అవకాశం ఉంది.
