“నా హత్యకు వల్లభనేని వంశీ కుట్ర పన్నాడు” – టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలనం
మంగళగిరి: తనను హత్య చేసేందుకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) కట్టుదిట్టమైన ప్లాన్ వేసాడని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు.
“యువగళం పాదయాత్రలో వ్యాఖ్యలు చేశానన్న కారణంగా హత్యకు కుట్ర”
మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బుద్ధా వెంకన్న, “నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో చేసిన వ్యాఖ్యలు, కొడాలి నాని మీద చేసిన విమర్శలు కారణంగా తనను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని” ఆరోపించారు. “వంశీ డ్రామాలు ఆడుతున్నాడు, అసలు నిజం ఇదే” అని ఆయన మండిపడ్డారు.
“వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకుంది”
“వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకుంది” అని బుద్ధా వెంకన్న ఆరోపించారు. “ఆ పార్టీ నేరస్తులతో నిండిపోయింది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “ప్రజలు వైసీపీ పాలన చూడలేక, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేకపోయారు” అని ఎద్దేవా చేశారు.
“జగన్ భ్రమలో ఉన్నాడు – భారతి మానసిక వైద్యులను చూపించాలి”
“జగన్ మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటాననే భ్రమలో ఉన్నాడు” అని వ్యాఖ్యానించిన వెంకన్న, “ఆయన సతీమణి భారతి మానసిక వైద్యులను చూపించాలి” అంటూ సెటైర్లు వేశారు.
“జగన్ పార్టీ లోపలే అసంతృప్తి”
“జగన్ మాటలు, నిర్ణయాలపై ఆయన సొంత పార్టీ నాయకులే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు” అని వెంకన్న వ్యాఖ్యానించారు. “ఐదేళ్లు అధికారంలో ఉండి కార్యకర్తలను పట్టించుకోని జగన్, ఇప్పుడు వాళ్లపై వల్లమాలిన ప్రేమ చూపిస్తున్నాడు” అని విమర్శించారు.
“జగన్కు ధైర్యం ఉంటే అసెంబ్లీలోకి రా” – బుద్ధా వెంకన్న సవాల్
“వైసీపీ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల తప్ప ప్రజలు ఎవరూ సంతోషంగా లేరు” అని ఆయన అన్నారు. “మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సెంటు భూమి కూడా కబ్జాకు గురైందా?” అని ప్రశ్నించారు. “జగన్కు నిజంగా ధైర్యం ఉంటే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలని” బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు.
ఈ ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో కొత్త సంచలనానికి తెరలేపగా, దీనిపై వల్లభనేని వంశీ లేదా వైసీపీ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
