ఎస్సీ వర్గీకరణలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర శూన్యం: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎస్సీ వర్గీకరణ (SC Classification) విషయంలో ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) తీవ్ర విమర్శలు చేశారు. గురువారం హైదరాబాద్లో ఆమె నివాసంలో దళితబంధు సాధన సమితి (Dalit Bandhu Sadhana Samithi) సమావేశం జరిగింది.
సుప్రీంకోర్టు తీర్పుతోనే వర్గీకరణకు మార్గం
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రధాని మోదీ (PM Modi), సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎలాంటి పాత్ర పోషించలేదని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు తీర్పుతోనే వర్గీకరణకు మార్గం సుగమమైందని గుర్తుచేశారు.
షమీమ్ అక్తర్ కమిషన్ నివేదిక బయటపెట్టాలి
ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని విమర్శించిన ఆమె, షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగాల కల్పనతో వర్గీకరణను ముడిపెట్టొద్దు
“దళితుల మధ్య విభేదాలు సృష్టించకుండా, ఎవరికీ అన్యాయం జరగకుండా వర్గీకరణ చేపట్టాలి. అయితే, రేవంత్ రెడ్డి మాత్రం ఉద్యోగాల కల్పనను వర్గీకరణతో ముడిపెడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు” అని మండిపడ్డారు. వర్గీకరణ పేరుతో ఉద్యోగ నియామకాలపై ఆటంకం సృష్టించొద్దని హితవు పలికారు.
దళితబంధు అమలులో మోసం
ఎన్నికల సమయంలో దళిత కుటుంబాలకు రూ.10 లక్షల బదులు రూ.12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు మాట మార్చారని ఆమె ఆరోపించారు. “అవాకులు, చెవాకులు పేలడం కాదు, దమ్ము ఉంటే 18 వేల దళిత కుటుంబాలకు వెంటనే దళితబంధు డబ్బులు విడుదల చేయాలి” అని ఆమె డిమాండ్ చేశారు.
ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిన ప్రభుత్వం
రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని, ఏడాదిలోనే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. గత బడ్జెట్లో ఎస్సీలకు రూ. 33,000 కోట్లు కేటాయించినా, కేవలం రూ. 9,800 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు.
“మనసున్న ప్రభుత్వం కాదు.. మానవత్వం లేని ప్రభుత్వం”
“రేవంత్ రెడ్డి మాటలు ప్రజలు నమ్మట్లేదని తెలిసి, ఢిల్లీ నుంచి ప్రియాంకా గాంధీని తీసుకొచ్చి హామీలు ఇప్పించారని” ఆమె ఎద్దేవా చేశారు. “ఇది మనసున్న ప్రభుత్వం కాదు, మానవత్వం లేని ప్రభుత్వం” అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు.
