బీజేపీ, బీఆర్ఎస్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
నారాయణపేట: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సూటిగా సవాల్ విసిరారు. నారాయణపేట జిల్లాలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
“పదేళ్లు పాలించిన కేసీఆర్ తెలంగాణకు ఏమిచ్చాడు? పన్నెండేళ్ల మోదీ ప్రభుత్వం ఏం చేసింది? ఏడాదిలోనే మేము చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం” అని సీఎం ప్రకటించారు. తన పాలనపై చర్చలో ఓడిపోతే ముక్కు నేలకు రాస్తానని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఇందిరమ్మ ఇళ్లపై కేసీఆర్కు సూటి ప్రశ్నలు
ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. “కేసీఆర్ పదేళ్లలో ఒక్కరికి అయినా డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చారా?” అంటూ ప్రశ్నించారు. పాలమూరు వలసలు తగ్గించేందుకు ప్రాజెక్టులను పూర్తి చేయాలని చూస్తుంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం అవరోధాలు సృష్టించిందని ఆరోపించారు.
“చర్చకు సిద్ధం – డేట్, ప్లేస్ చెప్పండి”
“పన్నెండేళ్ల మోదీ పాలనపై, పదేళ్ల కేసీఆర్ పాలనపై, మా ఏడాదికాల పాలనపై చర్చకు సిద్ధం. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి లేదా బండి సంజయ్ రావచ్చు.. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ వస్తారా, లేక తన కొడుకు లేదా అల్లుడు వస్తారా? డేట్, ప్లేస్ చెప్పండి.. నేను సిద్ధం!” అని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
“నన్ను కాపాడే బాధ్యత మీది”
తాము అందించిన ఇందిరమ్మ ఇండ్లు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇళ్ల మధ్య ప్రజలు తేడా చూడాలని సూచించారు. “కొందరు మనపై కుట్రలు చేస్తున్నారు.. అలాంటి వారికి మీరు సరైన గుణపాఠం చెప్పాలి. పనులు చేసే బాధ్యత నాది.. నన్ను కాపాడుకునే బాధ్యత మీది” అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
