సంధి ముగిసింది.. అధికారులపై చర్యలు తధ్యం: మధుయాష్కీ
హైదరాబాద్: ప్రభుత్వంలోని కీలక అధికారులు ప్రతిపక్షాలతో కుమ్మక్కై ప్రభుత్వం సమాచారాన్ని లీక్ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.
సోమేష్ కుమార్ బాగోతం ఇంకా బయటపడాలి
ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ, “సోమేష్ కుమార్ అండతోనే జీఎస్టీ కుంభకోణం జరిగింది. దోచుకున్న అధికారులపై విచారణ జరిపించాలి. అభయ్ కుమార్ లాంటి వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. విచారణలో మందకొడిగా వ్యవహరించడంతో రాజీ కుదిరిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
సింగరేణిలో కవితకు సహకరించిన అధికారి పై చర్యలు అవసరం
సింగరేణిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సహకరించిన ఓ అధికారి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్నారని మధుయాష్కీ ఆరోపించారు. “సంధి కాలం ముగిసింది.. ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన అధికారులను పక్కన పెట్టాలి” అని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలతో కుమ్మక్కయిన అధికారులపై కఠిన చర్యలు
ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వ రహస్యాలను లీక్ చేస్తున్న అధికారులను ఉపేక్షించేది లేదని మధుయాష్కీ హెచ్చరించారు. త్వరలోనే ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
