కరీంనగర్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రాబోయే మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై ఆలయ ఈవో ఎల్. రమాదేవి ఆలయానికి సంబంధించిన ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు.ఈ నెల ఫిబ్రవరి 14 నుంచి 16, 2026 వరకు జరగనున్న మహాశివరాత్రి జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆమె ఆలయ సిబ్బందికి సూచించారు.ఇటీవల నిర్వహించిన సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా ఆలయ ఉద్యోగులు సమన్వయంతో విధులు నిర్వహించి, భారీ సంఖ్యలో వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాతరను విజయవంతంగా నిర్వహించినందుకు ఈవో సిబ్బందిని అభినందించారు. మహాశివరాత్రి జాతరను మరింత సమర్థవంతంగా, సక్రమంగా నిర్వహించాలని భక్తుల సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా పనిచేసి, మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలని ఈవో ఎల్. రమాదేవి పిలుపునిచ్చారు.

