మంగళగిరి ఫిబ్రవరి 17 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి వీవర్స్ కాలనీ నగరపాలక సంస్థ హైస్కూల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఇందిరానగర్ యూపీహెచ్సీ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు హాజరై విద్యార్థులకు మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పోతినేని మాట్లాడారు. ప్రభుత్వం ఆరోగ్యవంతమైన సమాజం కోసం, పిల్లల మంచి ఆరోగ్యం కోసం నులిపురుగుల నిర్మూలనకు దేశవ్యాప్తంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేపట్టిందన్నారు. చిన్నపిల్లలు రక్తహీనత, నీరసం, కడుపునొప్పి, వాంతులు, వికారం వంటి సమస్యల బారిన పడుతున్నారన్నారు. పిల్లల సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిందన్నారు. మాత్రలు పంపిణీ చేయడంతో పాటు విద్యార్థులు భోజనానికి ముందు, టాయిలెట్స్ కు వెళ్ళిన తర్వాత చేతులు శుభ్రపరచుకోవటం వంటి ఆరోగ్య సూత్రాలను హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ అనూష పిల్లలకు తెలియజేయడం అభినందనీయమన్నారు. హైస్కూల్లో ఎనిమిది వందల మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారన్నారు. విద్యార్థులు వైద్యుల సూచనలను, ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి సమాజం గౌరవించే వ్యక్తులుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎమ్ఓ డాక్టర్ సుజాత, హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పీ అనూష, మలేరియా సబ్ యూనిట్ అధికారి ఏ శ్రీమన్నారాయణ, హైస్కూల్ హెచ్ఎం వెంకటేశ్వరరావు, హెల్త్ సెంటర్, మలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
