మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో రూ.25 లక్షల పునరుద్ధరణ.
మంగళగిరి ఫిబ్రవరి 18 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరిలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంకు చెందిన పురాతన రథం మంత్రి నారా లోకేష్ సొంత నిధులు రూ.25 లక్షలు వెచ్చించి పునరుద్ధరించారు. ఏళ్ల తరబడి మరమ్మతులు లేక ఊగిసలాడుతున్న ఈ రథంపై స్వామివారి ఊరేగింపులు నిర్వహించేవారు. భక్తులు పలుమార్లు రథం దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ ప్రత్యేక దృష్టి సారించి రథానికి సమగ్ర మరమ్మతులు చేయించి, కొత్తగా అలంకార రంగులు వేయించి శోభాయమానంగా తీర్చిదిద్దించారు. పునరుద్ధరించబడిన రథం ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి గ్రామోత్సవానికి వినియోగించబడింది. రథం నూతన రూపంలో దర్శనమివ్వడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. దేవస్థానం చరిత్రాత్మక ప్రాధాన్యతను కాపాడుతూ భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేపట్టిన ఈ చర్యపై స్థానికులు మంత్రి లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. పునరుద్ధరించిన రథంతో స్వామివారి ఊరేగింపు వైభవంగా సాగింది.
