యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఆలయ అర్చకులు, అధికారులు నిజాభిషేకం, విశ్వక్సేనారాధన, జలపూజ, నవధాన్యాలు నాటడం వంటి కార్యక్రమాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 28 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, జోడు సేవలు, ఏకాదశి లక్ష పుష్పార్చనలను అధికారులు రద్దు చేశారు. ఫిబ్రవరి 24న స్వామివారి ఎదుర్కోలు, 25న తిరుకల్యాణం, 28న అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలుకనున్నారు.
