నేటి తెలుగు పత్రిక: కులం, మతం ప్రాతిపదికన వివక్ష రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. ఓ ఎస్సీ అంగన్వాడీ టీచర్ భోజనం వండితే తమ పిల్లలు తినరని కొందరు చెప్పిన ఘటనను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ఇలాంటి పరిస్థితులు ఇప్పటికీ కొనసాగడం బాధాకరమన్నారు.
తెలంగాణ న్యాయమూర్తుల సంఘం ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. “రాజ్యాంగ నైతికత, జిల్లా న్యాయవ్యవస్థ పాత్ర” అంశంపై మాట్లాడిన ఆయన, న్యాయవ్యవస్థను ఒక పిరమిడ్తో పోల్చారు. అందులో కింది స్థాయి కోర్టులే బలమైన పునాదిగా ఉంటాయని, అవి ఎంత దృఢంగా పనిచేస్తే మొత్తం న్యాయవ్యవస్థ అంత బలోపేతంగా పనిచేస్తుందన్నారు.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేస్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, జ్యుడిషియరీ అంటే ప్రధానంగా ట్రయల్ కోర్టులేనని పేర్కొన్నారు. ట్రయల్ కోర్టులు న్యాయవ్యవస్థకు వెన్నెముకలాంటివని, వాటిని తక్కువగా చూడకూడదని సూచించారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి మౌషుమి భట్టాచార్య ప్రసంగించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి నవీన్ రావు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జి. రాజగోపాల్, కార్యదర్శి కె. మురళీమోహన్, టీజీఎల్ఎస్ఏ సభ్య కార్యదర్శి సీహెచ్ పంచాక్షరీ, రిజిస్ట్రార్ జనరల్, జ్యూడిషియల్ అకాడమీ డైరెక్టర్ శ్రీదేవి, డా. శ్రీనివాసరెడ్డి, లక్ష్మీశారద, మైత్రేయి తదితరులు పాల్గొన్నారు.
