నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొమ్మిదవ రోజు మంగళవారం ‘కల్లీ నెయ్యి’ అంశం తీవ్ర చర్చకు దారి తీసింది. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని తిరుమల లడ్డూ నాణ్యతపై వచ్చిన ఆరోపణలు సభలో హై వోల్టేజ్ వాతావరణాన్ని సృష్టించాయి.జీరో అవర్ను రద్దు చేసి ప్రత్యేక చర్చ చేపట్టిన ప్రభుత్వం, ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సుదీర్ఘంగా ఈ అంశంపై చర్చించింది. కూటమి పక్షానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు మాట్లాడగా, చివరగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం ఇచ్చారు.
నెయ్యి నాణ్యతపై వచ్చిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ) నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు విఘాతం కలిగించేలా గత వైసీపీ పాలకులు వ్యవహరించారని ఆరోపించారు. “ఎవరికి బాధ వచ్చినా వేంకటేశ్వరస్వామిని ఆశ్రయిస్తాం. అలాంటి పవిత్రక్షేత్రంలో అపచారం జరగడం బాధాకరం” అని సీఎం వ్యాఖ్యానించారు.
2019–24 మధ్య కాలంలో దేవాలయాలపై జరిగిన ఘటనలపై తాము ఆందోళనలు చేపట్టామని, తమపైనా కేసులు పెట్టారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం ప్రిన్సిపల్ సెక్రటరీ నియామకానికి, రెండోది టీటీడీ ఈవో నియామకానికి చేశానని వెల్లడించారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఇదే సమయంలో టీటీడీ బోర్డు సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, 2020 ఫిబ్రవరి 29 నుంచి నెయ్యి సేకరణ టెండర్ నిబంధనల్లో మార్పులు జరిగాయని ఆరోపించారు. నాటి పర్చేజ్ కమిటీ సమావేశంలో కొంతమంది ప్రత్యేక ఆహ్వానితుల ఒత్తిడితో నిబంధనలు మార్చారని పేర్కొన్నారు. కల్తీ వ్యవహారంలో నిజమైన బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చనీయాంశంగా మారే అవకాశం కనిపిస్తోంది.
