నేటి తెలుగు పత్రిక: బొబ్బిలి రాజులు అంటే తెలియని వారుండరు. శతాబ్దాల చరిత్ర కలిగిన బొబ్బిలి రాజకుటుంబం పేరు వినగానే ప్రత్యేక గౌరవం గుర్తుకొస్తుంది. ముఖ్యంగా 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధం వారి చరిత్రలో చెరగని ముద్ర వేసింది. స్థానం ఆవిర్భావం నుంచి రాజరిక ఆచారాలు, సంప్రదాయాలు కట్టుదిట్టంగా కొనసాగుతూ వస్తున్నాయి. కాలం మారినా, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నా, బొబ్బిలి సంస్థాన మహిళలు మాత్రం ఇప్పటికీ ఘోష విధానాన్నే అనుసరిస్తున్నారు.ఘోష విధానం ప్రకారం రాజకుటుంబ మహిళలు ప్రజల ముందుకు రావడం అరుదు. ఆలయాలకు వెళ్లినా, ఇతర కార్యక్రమాలకు హాజరైనా బయటవారికి కనిపించకుండా పరదాలు ఏర్పాటు చేసి తీసుకెళ్లడం ఆనవాయితీగా ఉంది. అందువల్ల బొబ్బిలి అంతఃపురంలోని రాణులను సాధారణ ప్రజలు ప్రత్యక్షంగా చూడటం దాదాపు జరగలేదు.
ఇలాంటి కట్టుబాట్ల మధ్య ఇటీవల జరిగిన ఒక సంఘటన ఆసక్తిని రేపింది. అమరావతిలో నిర్వహించిన విందుకు బొబ్బిలి రాజవంశీయులు హాజరయ్యారు. యువరాజుగా పిలవబడే ఎమ్మెల్యే బేబీ నాయన తన సతీమణి శిల్పాతో కలిసి ఈ కార్యక్రమానికి రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటివరకు ప్రజల్లో కనిపించని యువరాణి మొదటిసారిగా రాజకీయ వేదికపై దర్శనమివ్వడం చర్చనీయాంశమైంది.ఇది కేవలం మర్యాదపూర్వక హాజరేనా? లేక రాజకుటుంబం నుంచి రాజకీయాల్లోకి కొత్త సంకేతమా? అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. అంతఃపురపు గోడల మధ్యే పరిమితమైన జీవితం నుంచి ప్రజల ముందుకు రావడం వెనుక భవిష్యత్తు రాజకీయ సమీకరణాలున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మహిళా రిజర్వేషన్ నేపథ్యంలో బొబ్బిలి నియోజకవర్గం మహిళలకు కేటాయిస్తే శిల్పాను బరిలోకి దింపే ఆలోచన ఉందన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా, యువరాణి ప్రజావేదికపై కనిపించడం విజయనగరం, బొబ్బిలి రాజకీయాల్లో కొత్త ఆసక్తిని కలిగించింది.
ఏది ఎలా ఉన్నా, శతాబ్దాల సంప్రదాయాల మధ్య రాజమహల్ నుంచి బయట ప్రపంచంలోకి వేసిన ఈ అడుగు ప్రత్యేకంగా నిలిచిపోయిందని చెప్పవచ్చు.

