కోదాడ,ఫిబ్రవరి 24 (నేటి తెలుగు పత్రిక): కోదాడ పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి పురపాలక సంఘ నూతన పాలకవర్గం తక్షణమే కృషి చేయాలని తెలుగు రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు డిమాండ్ చేసారు. పట్టణంలోని పలు వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు స్తంభాలు, స్ట్రీట్ లైట్లు, పారిశుధ్యం, త్రాగునీరు తదితర మౌళిక సదుపాయాల కల్పనకు త్వరితగతిన కృషి చేయాలని చెప్పారు. వార్డులలో వారానికి కేవలం రెండు రోజులు మాత్రమే ఇండ్ల వెంట చెత్త సేకరిస్తున్నారని, అలా కాకుండా కనీసం రోజు విడిచి రోజైనా చెత్తను సేకరించాలని కోరారు. పట్టణంలోని ప్రధాన రహదారుల మీద పశువుల సంచారాన్ని, మాంసం విక్రయాలను, ఫ్లెక్సీలు కట్టడాన్ని, ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని కఠినంగా నిరోధించాలని డిమాండ్ చేసారు. పెద్ద చెరువు కట్ట మీద ఆకతాయిలు మద్యం తాగి, ఖాళీ సీసాలను పగులకొట్టి నడిచే దారి మీదే వేస్తున్న గాజు ముక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని, కరెంటు స్తంభాలకు కాలిపోయిన బల్బుల స్థానంలో కొత్త బల్బులను ఏర్పాటు చేసి మార్నింగ్ వాకర్స్ కు ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలని. వెంకటేశ్వరరావు కోరారు.
