నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర కేబినెట్ ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.20 కోట్ల ప్రమాద బీమా వర్తింపునకు ఆమోదం తెలిపింది. అలాగే రూ.1,056 కోట్ల మూలనిధితో సమగ్ర ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.ఈ నిర్ణయంతో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న తమ డిమాండ్ నెరవేరిందని ఉద్యోగ, పెన్షనర్స్ సంఘాల నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నివాసంలో సీఎంను కలిసి టీజీవో, టీఎన్జీవో, రెవెన్యూ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ సంఘాల ప్రతినిధులు స్వయంగా కృతజ్ఞతలు తెలిపారు. శాలువా కప్పి, పుష్పగుచ్చాలు అందించి ధన్యవాదాలు తెలిపారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన 652 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నగదు రహిత (క్యాష్లెస్) చికిత్స అందుబాటులోకి రానుంది. మొత్తం 1,998 వ్యాధులకు క్యాష్లెస్ సదుపాయం కల్పించడం ఈ పథకంలో ప్రత్యేకతగా పేర్కొన్నారు.ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కొద్దిసేపు ముచ్చటించారు.
