సూర్యాపేట : ఫిబ్రవరి 25(నేటి తెలుగు పత్రిక): కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పి ఆర్ డి ) జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన వెంకన్న డిమాండ్ చేశారు. బుధవారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక పిలుపులో భాగంగా సూర్యాపేట కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు పెంచుతామని హామీ ఇచ్చిన పింఛన్ నాలుగు వేల నుండి 6000 కు పెంచాలని కోరారు. వికలాంగులందరికీ పరికరాలు ఇవ్వాలని కోరారు. 2023వ సంవత్సరము నుండి కొత్త పింఛన్లు పెంచుతారని ఆశతో లక్షలాదిమంది వికలాంగులు ఎదురుచూస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు లక్షలాదిమంది ఎదురుచూస్తున్న వారికి పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. పాత పద్ధతిలో ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, కొత్తగా తీసుకొచ్చిన విబి జీరామ్ జి బిల్లు అమలు అయితే వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో వికలాంగులకు జాబు కార్డులు ఇవ్వాలన్నారు. జీవో నెంబర్ 34 ను వెంటనే అమలు చేయాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ ఏవో సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ వికలాంగుల హక్కుల వేదిక (ఎన్ పి ఆర్ డి ) జిల్లా అధ్యక్షులు అర్వపల్లి లింగయ్య, నాయకులు వెలుగు వనిత, వెంపటి వెంకటేశ్వర్లు, బి ఉపేంద్ర, శైలజ, లింగయ్య, నలిని, పుల్లన్న, చిరంజీవి, ఇందిరా, రామ్ కుమార్, సోమయ్య పాల్గొన్నారు.
