పరిశుభ్రతలో రాష్ట్రానికి మంగళగిరి ఆదర్శంగా నిలవాలి.
స్వచ్ఛతలో మంగళగిరి మోడల్గా నిలవాలి.
శుభ్రమైన మంగళగిరి-ఆరోగ్యకరమైన భవిష్యత్
చెత్తకు చెక్… స్వచ్ఛతకు ప్రారంభం
ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్ర మంగళగిరి సాధ్యం- నారా లోకేష్
మంగళగిరి ఫిబ్రవరి 25 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరిని పరిశుభ్రతలో రాష్ట్రానికి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంతో “స్వచ్ఛ మంగళగిరి 2.0” కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం శ్రీకారం చుట్టారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “స్వచ్ఛ మంగళగిరి” తొలి దశ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. రెండో దశలో మరింత ప్రణాళికాబద్ధంగా, సమర్థవంతంగా కార్యక్రమాన్ని అమలు చేసి మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిని పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నగరంలో చెత్త సేకరణ, వర్గీకరణ, పారుదల వ్యవస్థలను పటిష్టం చేయాలని అధికారులకు సూచించారు.వార్డు, గ్రామ స్థాయిలో ప్రత్యేక శుభ్రత డ్రైవ్లు నిర్వహించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై కఠిన చర్యలు తీసుకోవడం, పాఠశాలలు–కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం వంటి చర్యలు విస్తృతంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి ఎంతో అవసరమని, ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
“స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” విజన్ సాధనలో మంగళగిరి ముందంజలో నిలవాలని, ప్రజల భాగస్వామ్యం లేకుండా పరిశుభ్రత సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువత చురుకుగా పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా, సూపరింటెండెంట్ ఇంజినీర్ లీలా కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
