రూ. 35 లక్షల సీఎస్ఆర్ నిధులతో అంగన్వాడీ, పాఠశాల భవనాలు ఆధునీకరణ
విద్యార్థులకు అందుబాటులోకి ఆధునిక సౌకర్యాలు
మంగళగిరి ఫిబ్రవరి 25 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరి నియోజకవర్గం రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో మౌలిక సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో మంగళగిరి మండలం, ఆత్మకూరు గ్రామంలో కోకా కోలా ఇండియా వారి సీఎస్ఆర్ నిధులు రూ. 35 లక్షలతో పలు అంగన్వాడీ, పాఠశాలలో వివిధ రకాల అవసరాలు, అభివృద్ధి చర్యలు చేపట్టారు. అంగన్వాడీ-52, అంగన్వాడీ-53, అంగన్వాడీ-54 లను ఆధునికరించారు. అంగన్వాడీ-62 కు స్మార్ట్ టీవీ అందజేశారు. అలాగే జిల్లా పరిషత్ హైస్కూలును ఆధునీకరించి ఒక మోనిటర్, రెండు స్పీకర్లు, ఒక డెస్క్టాప్, 6 సీసీ కెమెరాలు, 20 జతల స్పోర్ట్స్ డ్రస్లు అందజేశారు. మంత్రి నారా లోకేష్ కృషితో మంగళగిరి ప్రజలు, స్థానిక విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రావడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
