వారికి మా పార్టీలోనే కొందరు నేతల మద్దతు ఉంది.
జనసేనలో సభ్యత్వం లేని వారికి నామినేటెడ్ పదవులు.
లోపాలను ఎత్తి చూపినందుకే నన్ను పదవి నుంచి తప్పించారు.
జనసేన పార్టీ నాయకులు కాపరౌతు సుందరయ్య.
మంగళగిరి ఫిబ్రవరి 25 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): జనసేన పార్టీని మంగళగిరి నియోజకవర్గంలో ఎదగనీయకుండా ఉండేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆ పార్టీ నాయకులు కాపరౌతు సుందరయ్య అన్నారు. అటువంటి వారికి జనసేన పార్టీలోని కొందరు మద్దతిస్తున్నారని ఆరోపించారు బుధవారం మధ్యాహ్నం మంగళగిరిలోని ప్రెస్ క్లబ్ నందు సుందరయ్య విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుందరయ్య మాట్లాడుతూ, జనసేన పార్టీలో సభ్యత్వం లేని వారికి, మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ట్రస్ట్ బోర్డ్, వ్యవసాయ మార్కెట్ కమిటీలలో నామినేటెడ్ పదవులు వరించాయని విమర్శించారు. 2014 నుంచి జనసేన పార్టీలో పనిచేస్తున్న వారికి పదవులు దక్కలేదని, 2024లో ఎన్నికల తర్వాత వైసిపి నుండి పార్టీలోకి వచ్చిన వారికి సభ్యత్వం లేని వారికి పదవులు రావటం దుర్మార్ధమని అన్నారు. దీనికి కేవలం నాయకత్వం పైనే తమకు అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు. రోజు వారి పార్టీ కార్యక్రమాల్లో ఇంచార్జ్ తప్ప మిగిలిన నాయకులు వేదికపై కనిపించరని తెలిపారు. సమాచారం లేకనే నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరమవుతున్నారని అన్నారు. కొందరి నాయకుల వలన మంగళగిరిలో జనసేన పార్టీ ఎదుగు, బొద్దుగూ లేకుండా పోయిందని తెలిపారు.
లోపాలను ఎత్తి చూపినందుకు పదవి నుంచి తప్పించారు
జనసేన పార్టీలో ఉన్న లోపాలను ఎత్తి చూపినందుకు తనను ఎర్రబాలెం గ్రామ అధ్యక్ష పదవి నుంచి తప్పించారని సుందరయ్య తెలిపారు. గత ఎన్నికల్లో ఎర్రబాలెం గ్రామంలో 5 వేల రికార్డు మెజార్టీ వచ్చిందంటే తామ కృషికి నిదర్శనమని అన్నారు. స్థానిక నాయకులను చూసి కాదని కేవలం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం పని చేస్తున్నామని తెలిపారు.
కాపులకు పదవుల్లేవు!
మంగళగిరి జనసేన పార్టీలో కాపు సామాజిక వర్గం వారు పార్టీ అభివృద్ధికి వెన్నెముకగా ఉన్నారని తెలిపారు. అయినప్పటికీ కాపు సామాజిక వర్గ నేతలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం దక్కలేదని తెలిపారు. ఇదే విషయాన్ని తామంతా త్వరలో అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు.
లోకేష్ లక్ష మెజార్టీతో గెలుస్తారని ముందే చెప్పా.
నారా లోకేష్ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న సమయంలో 2024 జనవరిలో ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో తాను మాట్లాడానని సుందరయ్య తెలిపారు. నారా లోకేష్ మంగళగిరి శాసనసభ్యునిగా లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారని చెప్పిన ఏకైక వ్యక్తిని తానేనని అన్నారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో కలిసి అనేక ప్రయోజనాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో ఆటవిడుపు కోసం కొలంబో వెళ్లి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ను వీక్షిస్తే దీనిని సైతం వైసీపీ నేతలు రాజకీయం చేసి అవాకులు, చవాకులు పేలుతున్నారని అన్నారు. టిడిపి జనసేన నేతలపై తప్పుడు ప్రచారం చేయటం వల్ల 151 సీట్లు నుంచి 11 సీట్లకు వైసీపీ పరిమితమైందని అన్నారు. అయినప్పటికీ వారి వైఖరిలో మార్పు రాలేదని తెలిపారు.
వారి పేర్లు త్వరలో వెల్లడిస్తా
జనసేన పార్టీ మంగళగిరిలో ఎదగకుండా ఉండేందుకు కారణమైన నాయకుల పేర్లు త్వరలో వెల్లడిస్తానని సుందరయ్య స్పష్టం చేశారు. కేవలం ఇంచార్జ్ కు తొత్తులుగా వ్యవహరించే వారికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి ఉందని తెలిపారు. మిగిలిన వారికి కనీసం పార్టీ కార్యక్రమాల సమాచారం కూడా ఉండదని పేర్కొన్నారు. 2014 నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వీర మహిళలకు కనీసం పదవులు లభించకపోవడం బాధాకరమన్నారు.
