పేదల బియ్యంపై మాఫియాకు కళ్లెం: విజయవాడ పశ్చిమ తహశీల్దార్ ఇంతియాజ్ పాషా
విజయవాడ: పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై విజయవాడ పశ్చిమ తహశీల్దార్ ఇంతియాజ్ పాషా మెరుపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 41వ డివిజన్ భవానిపురం ప్రాంతంలో అక్రమంగా నిల్వచేసిన 2500 కిలోల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు.
పట్టుబడిన నిల్వలు
డీ.నంబర్ 75-5-171, ప్రెసిడెంట్ వీధిలో మరమ్మతులు జరుగుతున్న ఓ భవనంలో 50 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు స్థానికులు సమాచారం అందించారు. ఆ ఇంటి యజమాని ఎస్కే ఖుద్దస్ కాగా, కొల్లి తిరుపతమ్మ అనే మహిళ పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసిందని తహశీల్దార్కి వివరించారు.
మాఫియాకు బిగించిన కళ్లెం
కొల్లి తిరుపతమ్మ గత కొంతకాలంగా రేషన్ మాఫియాగా మారి పేదల హక్కులను దోచుకుంటూ అక్రమ లాభాలు పొందుతున్నట్లు తేలింది. తహశీల్దార్ ఇంతియాజ్ పాషా దాడి చేయడంతో ఆమె కార్యకలాపాలకు అడ్డుకట్ట పడింది. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు.
ప్రజల సహకారం కోరిన తహశీల్దార్
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరిగితే వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని తహశీల్దార్ ఇంతియాజ్ పాషా ప్రజలకు సూచించారు. ప్రభుత్వం పేదల కోసం బియ్యాన్ని ఇంటివద్దకే అందిస్తున్నప్పటికీ, కొందరు మాఫియాలు పక్కదారులు పడుతుండటం దురదృష్టకరం అని అన్నారు.
దాడి దళంలో పాల్గొన్న అధికారులు
ఈ దాడిలో పశ్చిమ తహశీల్దార్ ఇంతియాజ్ పాషాతో పాటు ఇన్ఛార్జ్ ఆర్ఐ వెన్నెల, సివిల్ సప్లై ఆర్ఐ వెంకట్, విఆర్వోలు రాజేష్, యోసేపులు పాల్గొన్నారు. అక్రమ రవాణాను అడ్డుకున్న తహశీల్దార్ చర్యలను స్థానికులు అభినందించారు.
