పులివెందుల ఫిబ్రవరి 25 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): శనగలు పండించిన ప్రతి రైతు మద్దతు ధరలు సద్వినియోగం చేసుకోవాలని టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి కోరారు. సింహాద్రిపురం లో ఏర్పాటుచేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన సతీమణి పులివెందుల జడ్పిటిసి మా రెడ్డి లతా రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రైతుకు నష్టం రాకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉండేలా శనగల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట దళారుల పాలై నష్టపోకూడదన్నదే తమ లక్ష్యమన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను ప్రతి ఒక్క రైతూ వినియోగించుకోవాలని కోరారు. గతంలో రైతులు పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈ కొనుగోలు కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. సింహాద్రిపురం మండలంతో పాటు పరిసర గ్రామాల శనగ రైతులందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడే తమ పంటను విక్రయించి లాభపడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు, కూటమి నాయకులు పుప్పాల శ్రీధర్ రెడ్డి,సింహాద్రిపురం సింగిల్ విండో అధ్యక్షుడు పీజీ గోపాల్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
