నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరవాసులకు గుడ్న్యూస్. మెట్రో ప్రయాణికులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ సమస్యకు పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం ‘పాడ్ ట్యాక్సీ’లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (PRT) విధానంలో అమలు చేయనున్న ఈ ప్రాజెక్ట్, మెట్రో స్టేషన్లను ఐటీ హబ్లు, కార్యాలయాలు, నివాస ప్రాంతాలతో నేరుగా అనుసంధానించనుంది.
ప్రస్తుతం నగరంలో రోజుకు సుమారు ఐదు లక్షల మంది హైదరాబాద్ మెట్రో రైలు సేవలను వినియోగిస్తున్నారు. అయితే స్టేషన్ నుంచి గమ్యస్థానానికి చేరుకోవడం ప్రయాణికులకు కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్కు సంబంధం లేకుండా ఎలివేటెడ్ ట్రాక్లపై నడిచే పాడ్ ట్యాక్సీలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
తొలి దశలో ఈ ప్రాంతాలు
రాయదుర్గం–కూకట్పల్లి, రాయదుర్గం–హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ సిటీ, సచివాలయ పరిసర ప్రాంతాల్లో ప్రాజెక్ట్ అమలు చేయాలని యోచిస్తున్నారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో (DBFOT మోడల్) ఈ ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. ప్రస్తుతం సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కొనసాగుతోంది.
పాడ్ ట్యాక్సీల ప్రత్యేకతలు
- పూర్తిగా ఆటోమేటెడ్, డ్రైవర్ లేకుండా నడుస్తాయి
- గంటకు గరిష్ఠంగా 40 కి.మీ. వేగం
- ఒక్కో పాడ్లో 6–8 మంది ప్రయాణం
- గంటకు సుమారు 10 వేల మంది రవాణా సామర్థ్యం
- విద్యుత్/బ్యాటరీ ఆధారంగా నడవడం వల్ల కాలుష్యం లేదు
- ముందస్తు బుకింగ్ సౌకర్యం
ఇలాంటి ప్రాజెక్ట్ ముంబైలో ప్రారంభ దశలో ఉండగా, త్వరలోనే హైదరాబాద్లోనూ పాడ్ ట్యాక్సీలు నగర రవాణా వ్యవస్థలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాయి. అన్నీ అనుకూలిస్తే రాబోయే కొన్నేళ్లలో ఈ సౌకర్యం ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
