నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లో కొత్త ఇళ్ల మంజూరుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉగాది నాటికి పేదలకు ఇళ్లను కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలవుతున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈ ఇళ్లను మంజూరు చేయనున్నారు.గతేడాది డిసెంబర్ వరకు దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం, వాటిని పరిశీలించి లబ్ధిదారుల జాబితాను కేంద్రానికి పంపించింది. ప్రస్తుతం కేంద్రం పునఃపరిశీలన చేపట్టగా, ఆమోదం వచ్చిన వెంటనే లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించనున్నారు.
నియోజకవర్గం ప్రాతిపదికన కేటాయింపులపై వివాదం
గతంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్దిష్ట సంఖ్యలో ఇళ్లు కేటాయించే విధానం ఉండేది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం యాప్ ఆధారంగా నేరుగా లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది. దీనివల్ల నియోజకవర్గాల వారీగా కేటాయింపులు కనిపించడంలేదని ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించారు.ఈ విషయంపై గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ, ఎమ్మెల్యేల అభ్యర్థనను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితి, ఆదాయం వంటి ప్రమాణాల ఆధారంగా ప్రస్తుతం ఇళ్ల కేటాయింపు జరుగుతోందని స్పష్టం చేశారు.
వాంబే కాలనీల అంశం
అసెంబ్లీలో వాంబే కాలనీల మరమ్మత్తుల విషయమై కూడా చర్చ జరిగింది. బ్యాంకు లోన్, లబ్ధిదారుల వాటాతో నిర్మించిన ఆ ఇళ్లకు ప్రస్తుతం ప్రత్యేక మరమ్మత్తు విధానం లేదని మంత్రి తెలిపారు. అయితే ఈ అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
ఉగాది నాటికి కొత్త ఇళ్ల మంజూరుపై స్పష్టత రానుండగా, లబ్ధిదారులు ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
