నేటి తెలుగు పత్రిక: వెలుగు విఓఏలు, మెప్మా ఆర్పీలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి పరిష్కారం చూపిస్తామని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. గురువారం వెలగపూడి సచివాలయంలో AP వెలుగు VOA ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర నాయకత్వం మంత్రిని కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ ప్రతినిధి బృందంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ధనలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి మహేష్, ఉపాధ్యక్షురాలు సుభాషిణి, ఆర్పీల రాష్ట్ర నాయకులు జె.ఝాన్సీ, ఏ.కమల తదితరులు పాల్గొన్నారు.
యూనియన్ నాయకత్వం వేతనాలు పెరిగి ఏడు సంవత్సరాలు పూర్తయ్యాయని, పెరుగుతున్న ధరలతో విఓఏలు, ఆర్పీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రికి వివరించారు. వేతనాల పెంపు, గ్రూప్ ఇన్సూరెన్స్, హెచ్ఆర్ పాలసీ అమలు, రెండు సంవత్సరాల శ్రీనిధి ఇన్సెంటివ్ బకాయిల చెల్లింపు, ప్రమోషన్ సౌకర్యం కల్పించాలంటూ కోరారు. అలాగే పొదుపు మహిళలకు రూ.10 లక్షల వడ్డీ రాయితీ, స్వావలంబన–అభయాస్తం–మహిళా మార్ట్ పెట్టుబడుల చెల్లింపులపై కూడా విజ్ఞప్తి చేశారు.మంత్రి స్పందిస్తూ శ్రీనిధి ఇన్సెంటివ్ బకాయిలు చెల్లిస్తామని, సెల్ఫోన్లు అందజేస్తామని తెలిపారు. మిగిలిన డిమాండ్లపై అసెంబ్లీ సమావేశాల అనంతరం జాయింట్ మీటింగ్ నిర్వహించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఫిబ్రవరి 25న నిర్వహించిన రాష్ట్ర ధర్నా అనంతరం ఆర్పీలకు గ్రేడింగ్ విధానం రద్దు చేసి రూ.8,000 వేతనం చెల్లించే అంశంపై కూడా సానుకూలంగా స్పందించినట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు.
