వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించి కార్యక్రమాలు చేపడుతున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వరంగల్ జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అనేక హామీలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యం లో ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
సమీక్ష సమావేశంలో ముఖ్యాంశాలు
మంత్రివర్గ సభ్యులు కొండా సురేఖ, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేణు నరేందర్ రెడ్డిలతో కలిసి మంత్రి శ్రీనివాస్ రెడ్డి నేడు సచివాలయంలో వరంగల్ నగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఐఆర్ఆర్, ఓఆర్ఆర్, భద్రకాళి చెరువు, విమానాశ్రయం వంటి ప్రాజెక్టులపై ముఖ్యంగా చర్చించారు.
ప్రాజెక్టులపై ప్రత్యేక ఆదేశాలు
ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ లను త్వరితగతిన తయారుచేయాలని మంత్రి అధికారులకు సూచించారు. అలాగే, ప్రతి ప్రాజెక్టును ప్రభుత్వ నిర్ణయించిన గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.
రింగ్ రోడ్, ఎయిర్ పోర్ట్ నిర్మాణం
వరంగల్ నగరంలో నిర్మించనున్న రింగ్ రోడ్డుతో జాతీయ రహదారులకు కనెక్టివిటీ పెంచేందుకు అవసరమైన భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని మంత్రి చెప్పారు. అలాగే, ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని, భద్రకాళి చెరువు శుద్ధీకరణ పనులను వేగవంతంగా ప్రారంభించాలని ఆదేశించారు.
