నేటి తెలుగు పత్రిక: ఏపీలోని అనాథ పిల్లలకు శుభవార్త. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త పథకమైన మిషన్ వాత్సల్య అమలు ద్వారా అర్హులైన పిల్లలకు ప్రతీ నెలా ఆర్థిక సాయం అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ పథకం కింద రూ.1,250 నుంచి గరిష్టంగా రూ.1,750 వరకు నగదు సాయం లభిస్తుంది.ఈ సహాయం నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ ఆధ్వర్యంలోని నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్ ద్వారా అందిస్తున్నారు. ఉగ్రవాద హింస, ఎడమచేతి తీవ్రవాదం, సరిహద్దు కాల్పుల వంటి ఘటనల వల్ల అనాధలైన పిల్లలకు విద్య, సంరక్షణ కోసం ఈ పథకం ఉపయోగపడుతుంది.
📌 ఎవరికెంత సాయం?
- 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, కంప్యూటర్ కోర్సులు: రూ.1,250/నెల
- గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్: రూ.1,500/నెల
- మెడికల్, ఇంజినీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు: రూ.1,750/నెల
గరిష్టంగా 25 సంవత్సరాల వయసు వరకు లేదా చదువు పూర్తయ్యే వరకు ఈ సాయం నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
✅ అర్హతలు
- అనాథ లేదా నిరాశ్రయులై ఉండాలి
- ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థలో చదువుతూ ఉండాలి
- ఫీల్డ్ వెరిఫికేషన్లో అర్హత పొందాలి
- టెర్రరిజం లేదా క్రాస్ బోర్డర్ ఫైరింగ్ ప్రభావిత కుటుంబాలకు ప్రాధాన్యత
📝 దరఖాస్తు విధానం
- ఎమ్మార్వో లేదా ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేయాలి.
- గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు.
- అర్హత నిర్ధారణ అనంతరం పథకం కింద ఎంపిక చేస్తారు.
సమర్పించాల్సిన పత్రాలు:
ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఇన్కమ్ సర్టిఫికేట్, అనాథ ధృవీకరణ పత్రం, విద్యాసంస్థ బోనఫైడ్ సర్టిఫికేట్.
అనాథ పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకం ద్వారా అర్హులైన వారు తప్పక దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
