నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విముక్తి పొందిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రత్యేక కోర్టు స్పష్టం చేసిన అనంతరం రాజకీయంగా సంచలన ప్రకటనలు చేశారు.కోర్టు తీర్పు నేపథ్యంలో గతంలో KTR చేసిన ట్వీట్పై కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఓటమికి లిక్కర్ కేసే కారణమంటూ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు సముచితమని ప్రశ్నించారు. “పార్టీ ఓటమికి కారణం నేనా? నా మీద కేసు పెట్టింది పార్టీ కోసమే కాదా?” అంటూ నిలదీశారు. తాను మొదటి నుంచీ ఈ కేసు తప్పుడు కేసు అని చెబుతున్నప్పటికీ తనకు అండగా ఎందుకు నిలబడలేదని ప్రశ్నించారు.
అదేవిధంగా భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ పార్టీలపై కూడా కవిత విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు ఒక్కటే అంటూ ఆరోపించారు. ఓటమిని ఒప్పుకునే ధైర్యం ఉండాలన్నారు. పార్టీ ఓటమిని తనపై రుద్దాలని ప్రయత్నిస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు.తప్పు చేయకపోయినా ఏడాదికిపైగా మానసిక క్షోభ అనుభవించానని కవిత పేర్కొన్నారు. మరోవైపు రెండు నెలల్లో కొత్త పార్టీ ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్లనున్నట్టు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
