- అప్పట్లో లిఫ్ట్ ఆపేసి.. ఇప్పుడు నాటకాలు ఎందుకు? మండలిలో మంత్రుల ప్రశ్న
- ఒక్క సంతకంతో 102 ప్రాజెక్టులు రద్దు చేశారంటూ వైసీపీపై విమర్శలు
- “ఏం చేయలేదని మీరు ఒప్పుకున్నారు” – సభలోనే ఘాటు వ్యాఖ్యలు
- మీరు అన్యాయం చేస్తే.. ఎన్. చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తున్నారు
- రాయలసీమ అభివృద్ధి మహాయజ్ఞానికి అడ్డుపడొద్దని హెచ్చరిక
- మండలిలో మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, కింజరాపు అచ్చన్నాయుడు ఫైర్
అమరావతి,ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): అమరావతిలో జరిగిన శాసనమండలి సమావేశంలో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ అంశంపై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.రాయలసీమ లిఫ్ట్ పనులు ఆగిపోయిన విషయంపై వైసీపీ సభ్యులు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడంపై మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, కింజరాపు అచ్చన్నాయుడు ఘాటుగా ప్రతిస్పందించారు. 2020లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నివేదిక స్పష్టంగా వచ్చినప్పటికీ అప్పటి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఐదేళ్ల పాటు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని, బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయలేదని వైసీపీపై విమర్శలు గుప్పించారు.
“చంద్రబాబు సమర్థతకు నిదర్శనం”
హంద్రీనీవా ప్రాజెక్ట్ పూర్తి చేసి తక్కువ సమయంలోనే 44 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాయలసీమ ప్రాజెక్టులు, చెరువుల్లో 366 టీఎంసీల నీరు నిల్వలో ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాయలసీమ సాగునీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే వేల కోట్లు ఖర్చు చేశామని, తాజా బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించామని తెలిపారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.వైసీపీ పాలనలో నిలిచిపోయిన పనులను ప్రస్తుతం తమపై మోపే ప్రయత్నాలు చేయొద్దని మంత్రులు హితవుపలికారు. రాయలసీమ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
