నదుల అనుసంధానంతో తెలుగు తల్లికి జలహారతి
అమరావతి, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ప్రతీ ఎకరాకు నీరు అందించడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సాగునీటి రంగంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులపై త్వరలో సమగ్ర బ్లూప్రింట్ రూపొందిస్తామని వెల్లడించారు.
జల భద్రతపై దీర్ఘకాలిక విజన్
- 2047 స్వర్ణాంధ్ర విజన్లో నీటి భద్రతకు ప్రాధాన్యం
- మే 15 నాటికే నారుమళ్లకు నీరు అందించే ప్రణాళిక
- గోదావరి నుంచి వృథాగా సముద్రంలో కలిసే 3,000 టీఎంసీల వరదనీటిని వినియోగించాలన్న లక్ష్యం
- వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం
- దేశవ్యాప్తంగా గంగా–కావేరి అనుసంధానం తన ఆకాంక్షగా వ్యాఖ్య
ప్రాజెక్టులపై ఘాటు వ్యాఖ్యలు
పోలవరాన్ని విధ్వంసం చేశారని, డయాఫ్రాం వాల్ దెబ్బతిన్నదని సీఎం ఆక్షేపించారు. వెలిగొండ పూర్తికాకుండానే రిబ్బన్ కట్ చేశారని విమర్శించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులలో చాలా వరకు టీడీపీ హయాంలోనే నిర్మాణమయ్యాయని పేర్కొన్నారు.హంద్రీనీవా కాలువ విస్తరణ, కుప్పం వరకు నీటి తరలింపు వంటి పనులను వివరించారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
నిల్వలు–మైక్రో ఇరిగేషన్
ప్రస్తుతం రిజర్వాయర్లలో 793 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. రాష్ట్రంలో 16 లక్షల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ అమలవుతోందని, భూగర్భజలాలు సగటున 6 మీటర్ల మేర పెరిగాయని వెల్లడించారు.
పోలవరం–నల్లమల సాగర్
పోలవరం–నల్లమల సాగర్ అనుసంధానం వల్ల రెండు రాష్ట్రాలకు లాభమే తప్ప నష్టం లేదని స్పష్టం చేశారు. గోదావరి వరద జలాలను వినియోగించుకునే ప్రాజెక్టు మాత్రమేనని పేర్కొన్నారు.చివరగా, ప్రతీ ఎకరాకు సాగునీరు, ప్రతీ ఇంటికీ తాగునీరు, పరిశ్రమలకు నీటి భద్రత కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
