- గత ఐదేళ్లలో అనర్హుల నియామకాలపై మ్యాన్పవర్ ఆడిట్
- మాజీ వీసీపై విజిలెన్స్ నివేదిక రాగానే చర్యలు
- ఏయూ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం
అమరావతి,ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): గత ప్రభుత్వ కాలంలో ఆంధ్రా యూనివర్సిటీ ను వైసీపీ కార్యాలయంగా మార్చేశారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఆరోపించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో గత ఐదేళ్లలో వైసీపీ కార్యకర్తలను వివిధ పోస్టుల్లో విచ్చలవిడిగా నియమించుకున్నారని, దీనిపై ప్రత్యేక మ్యాన్పవర్ ఆడిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే 30 రోజుల్లో ఆడిట్ పూర్తిచేసి అనర్హులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.కాంట్రాక్ట్, ఎంటిఎస్ సిబ్బంది రెగ్యులరైజేషన్పై మ్యాన్పవర్ ఆడిట్ అనంతరం ఫైనాన్స్ శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మాజీ వీసీపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని, నివేదిక రాగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ర్యాంకింగ్స్ పతనంపై ఆందోళన
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో 2019లో 29వ స్థానంలో ఉన్న ఏయూ, 2023 నాటికి 76వ స్థానానికి పడిపోయిందని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 41వ స్థానానికి తీసుకువచ్చామని, టాప్-10లోకి తీసుకెళ్లడం లక్ష్యమని చెప్పారు. యూనివర్సిటీ కేటగిరీలోనూ ర్యాంకు పడిపోయిందని, ప్రస్తుతం మళ్లీ మెరుగుదల దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
శతాబ్ది వేడుకలు ఘనంగా
విశాఖ పర్యటనలో వీసీతో సమావేశమై శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమీక్షిస్తానని మంత్రి తెలిపారు. సభ్యుల సూచనలు తీసుకుని ఏయూ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
