- విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సీఎం కి ఘన స్వాగతం
- కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో విద్యార్థినులతో ముచ్చట
- 14 ఏళ్ల లోపు బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ప్రారంభం
- డిజిటల్ హెల్త్ రికార్డుల్లో టీకా వివరాలు నమోదు చేయాలన్న ఆదేశం
విజయనగరం, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): చీపురుపల్లికి విచ్చేసిన ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను సందర్శించారు.ఆసుపత్రిలో విద్యార్థినులతో మాట్లాడిన సీఎం, హెచ్పీవీ వ్యాక్సిన్ వల్ల గర్భాశయ క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని వివరించారు. క్యాన్సర్ రాకుండా ముందస్తు రక్షణ కోసం ఈ టీకా ఇస్తున్నామని చెప్పారు. సీఎం సమక్షంలోనే 14 ఏళ్ల లోపు బాలికలకు ఏఎన్ఎమ్ల ద్వారా వ్యాక్సిన్ వేసారు. ‘సంజీవని’ కార్యక్రమంలో భాగంగా వ్యాక్సినేషన్ వివరాలను డిజిటల్ హెల్త్ రికార్డుల్లో నమోదు చేయాలని సీఎం సూచించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు సేవలందించాలని పేర్కొన్నారు.ఆసుపత్రి పనితీరుపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక అడ్వైజరీ కమిటీని నియమించాలని కూడా సీఎం సూచించారు.




