ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్పై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రశంసలు కురిపించారు. కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్వికకు చికిత్స కోసం మంత్రి చేసిన ప్రకటనపై ఆమె సోషల్ మీడియాలో స్పందించడం ఇప్పుడు వైరల్గా మారింది.కర్నూలు జిల్లాకు చెందిన పునర్విక ‘SMA టైప్-1’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధికి చికిత్సలో భాగంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘Zolgensma’ ఇంజెక్షన్ అవసరమని వైద్యులు తెలిపారు. దీనికి దాదాపు రూ.16 కోట్ల వ్యయం అవుతుంది. ఆర్థికంగా అంత స్తోమతలేని తల్లిదండ్రులు విరాళాల కోసం విజ్ఞప్తి చేయగా, ప్రజల సహకారంతో రూ.10 కోట్ల వరకు సమకూరింది. ఇంకా రూ.6 కోట్లు అవసరమైన పరిస్థితిలో మంత్రి నారా లోకేశ్ మిగిలిన మొత్తాన్ని సమకూర్చే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. పునర్విక ధైర్యాన్ని అభినందిస్తూ ఆయన చేసిన ట్వీట్పై జాన్వీ కపూర్ స్పందిస్తూ “మానవత్వం ఇంకా బతికే ఉంది.. ట్రూలీ అప్రిషియేటెడ్” అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి నిర్ణయాన్ని నెటిజన్లు అభినందిస్తూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
